రెవెన్యూ, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు శాశ్వత భవనాలు: మంత్రి పొంగులేటి

  • తొలి దశలో 125 తహసీల్దార్, 11 ఆర్డీవో కార్యాలయాలకు కొత్త భవనాలు నిర్మిస్తున్నట్టు పొంగులేటి వెల్లడి
  • దీని ద్వారా శిథిలావస్తలో ఉన్న భవనాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని వెల్లడి
  • భవనాల నిర్మాణాల కోసం స్థలాల గుర్తింపును వేగవంతం చేయాలని అధికారులకు ఆదేశం

రాష్ట్రంలోని అన్ని ఆర్డీవో, తహసీల్దార్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు ఆధునిక సౌకర్యాలతో శాశ్వత భవనాలను నిర్మించనున్నట్లు తెలంగాణ రెవెన్యూ, హౌసింగ్ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రకటించారు. ఈరోజు అధికారులతో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ప్రజలకు గౌరవప్రదమైన సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.


తొలి దశలో భాగంగా 125 తహసీల్దార్, 11 ఆర్డీవో కార్యాలయాలకు ఒకే నమూనాలో కొత్త భవనాలను నిర్మించనున్నట్లు మంత్రి వెల్లడించారు. అద్దె ఇళ్లలో, శిథిలావస్థలో ఉన్న కార్యాలయాల సమస్యకు దీని ద్వారా శాశ్వత పరిష్కారం లభిస్తుందన్నారు. సీఎం రేవంత్ రెడ్డి సూచనల మేరకు తుది డిజైన్లను ఖరారు చేస్తామని తెలిపారు. భవన నిర్మాణాల కోసం స్థలాల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.


మరోవైపు, ఓఆర్ఆర్ పరిధిలోని 39 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలను 12 క్లస్టర్లుగా విభజించి ఆధునిక సమీకృత భవనాలుగా అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే గచ్చిబౌలి, మేడ్చల్, పటాన్‌చెరు, కోహెడలలో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయని చెప్పారు. 


గత ప్రభుత్వం ప్రణాళిక లేకుండా మండలాల పునర్విభజన చేసిందని విమర్శించిన మంత్రి, తాము కొత్త మండలాలకు అవసరమైన పోస్టులను భర్తీ చేసి పరిపాలనను బలోపేతం చేశామని వివరించారు. అలాగే, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాల కోసం స్థలాల గుర్తింపు ప్రక్రియను ముమ్మరం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.


Ponguleti Srinivas Reddy
Telangana Revenue Department
Tahsildar Office Buildings
Sub Registrar Office Clusters
Indiramma Houses Land Identification
Telangana Government Infrastructure

More Telugu News